మన మహిళామణులు

డాక్టర్ చీదెళ్ళ సీతాలక్ష్మి గారు ఎం.ఎ.ఎం.ఫిల్.పి.హెచ్.డి

కలుపుగోరుతనం ఇతరులను ప్రోత్సహించటం సమీక్షకురాలిగా చక్కని సలహాలు సూచనలు ఇవ్వడం లో ఆమె అందెవేసిన చేయి.భర్త శ్రీ పరిమి వెంకటసత్యమూర్తిగారి ప్రోత్సాహం జంట కవులుగా కలిసి వెళ్లి తాము చూసిన ప్రదేశాలు కళ్లకు కట్టినట్లు రాయడం సీతాలక్ష్మి గారి ప్రతిభ! దర్పణం సాహిత్య వేదిక ప్రధాన కార్యదర్శి గా కొత్త కలాలకు ఊతం ఇస్తున్నారు.వివిధ ప్రాంతాల్లో ని తెలుగు కలాలకు పదును పెడుతున్నారు.AppScద్వారా సెలెక్ట్ ఐనా ఆమె ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేశారు.తెలుగు విశ్రాంత సహాయాచార్యులుగా ఆమె ఖాళీగా ఉండకుండా రేడియో టివీలలో ఎన్నో ప్రసంగాలు చేశారు.కవి‌మ్మేళనాలకు హాజరవుతారు.మంచి రచయిత్రి కవయిత్రి గా గుర్తింపు పొందారు.తంగేడు సాక్షి సాహితీ కిరణం నవతెలంగాణ నేటి నిజం మొదలైన పత్రికల్లో ఆమె రచనలువెలువడుతూ పాఠకుల ప్రశంసలు అందుకుంటున్నాయి.
ఆమె పొందిన అవార్డులు లెక్క లేనన్ని! ముఖ్యంగా యం.వి.నరసింహారెడ్డిఅవార్డు రాష్ట్ర స్థాయిలో పురస్కారం NSS best programme ఆఫీసర్ గా రాష్ట్ర ప్రభుత్వ అవార్డు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు జిల్లా స్థాయిలో బెస్ట్ విమెన్ ఎంపవర్మెంట్ అవార్డు ఫేస్బుక్ వాట్సప్ వేదికలో వివిధ.సమూహాల్లో కవితల విజేత గా ఎన్నో సార్లు నిలిచారు.కవితాభూషణ సహస్రసమీక్షాభూషణ ఇష్టపదిభూషణ బిరుదులు సత్కారాలు పొందారు.బెంగుళూర్ వారి అంబేద్కర్ సాహితీ రత్న జాతీయ స్థాయి పురస్కారం తానా వారి ప్రశంసాపత్రం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు తెలంగాణ జాగృతి వారి పురస్కారం 2017లోప్రపంచతెలుగు మహాసభలో సన్మానం పొందారు.

           డా. చీదేళ్ళ సీతామహాలక్ష్మీ

సాహితీ మంజూష సహస్రకవితాస్ఫూర్తి పురస్కారం మల్లినాధసూరికళాపీఠం ఏడుపాయల సంస్థాన్ వారి పురస్కారం బాసర లో ఉత్తమ ఉపాధ్యాయ రత్న అవార్డు ఆమె కీర్తి కిరీటంలో పొదిగిన రత్నాలు.అచ్చువేయబడిన పుస్తకాలలో ప్రముఖ మైన వి ‘తెలుగులేఖాసాహిత్యం_పి.హెచ్.డి.పరిశోధనాగ్రంధం తెలుగు కావ్యావతారికలలో సాహిత్య విమర్శ ఎం.ఫిల్.పరిశోధనాగ్రంధం తెలంగాణ సాహిత్య చరిత్ర,జానకీ రాఘవీయం (జననీ శతకం) సీతమాట పద్యద్విశతి, నందగిరి ఇందిరాదేవి కథలు,నందగిరి ఇందిరాదేవి అమ్మమ్మ కథలు వారి సంపాదకులుగా తెలంగాణ సాహిత్య అకాడమీ వారు ముద్రించారు. 60కిపైగా సంకలనాలలో కవితలు ప్రచురించబడ్డాయి. అనేక ప్రక్రియల్లో రచనలు చేశారు.

జీవితంలో అనుభవం – అనుభూతి
————————-

9 వ తరగతి చదివే రోజుల్లో ఒకసారి నేను మా అక్క DOL చదువుతున్న ఆంధ్ర సారస్వత పరిషత్ కు అక్కతో సరదాగా వెళ్ళాను. సాయంత్రం 6 గంటలనుండి రాత్రి 9 గంటల వరకు నడిచేది.వాళ్ళ క్లాసులో అక్కతో పాటు కూచున్నాను.కే. కె.రంగానాథా చార్యులు ప్రిన్సిపాల్ గా వున్నారు.వ్యాకరణం చెప్పే పెరవల్లి లింగయ్య శాస్త్రి గారు ఆరోజు రాలేదు.ప్రిన్సిపాల్ క్లాసు తీసుకున్నారు.సంధి గురించి చెప్తూ ఏవో ప్రశ్నలు విద్యార్థులను అడిగితే నాకు వచ్చిందేదో ఆసక్తితో జవాబు చెప్పాను.సర్ ఏమనలేదు కానీ సరదాగా ఎవరీ అమ్మాయి అని అడిగితే మా చెల్లెలు సర్ అని అక్క చెప్పింది.10 వ తరగతి అయిపోగానే మన కాలేజీలోనే చేర్పించు మని చెప్పారు.
పదోతరగతి సుల్తాన్ బజారు అమ్మాయిల స్కూల్ లో చదివాను.నూరు మందిలో పాస్ అయిన ముగ్గురిలో నేను ఒకదాన్ని.నాకు పాలిటెక్నీక్ చేసి ఇంజనీరింగ్ చేయాలని కోరిక.కానీ మా పెద్దక్క విజయలక్ష్మి ప్రిన్సిపాల్ చెప్పాడని మా నాన్నకు చెప్పి నన్ను తీసుకొని వాళ్ళ కాలేజీలో D.O.L చేర్పించింది.చిన్నవాళ్ళము అమాయకత్వం ఎక్కువ కాబట్టి పెద్దవాళ్ళు ఏది చెపితే అది వినేవాళ్ళం.ఎదిరించే మనస్తత్వం కాదు కూడా.
సరే కాలేజీలో చేరాక అనుకున్నాను దీనిలో అంతం చూడాలని.అందరూ తెలుగు పండిట్ చేసి టీచర్లు అయ్యేవారు .అందుకని నేను పండిట్ ట్రైనింగ్ చేయలేదు.DOL రెండేళ్లు,చదివాక మా బ్యాచ్ నుండే రెండేళ్లు ఉన్న BOL మూడేళ్లు అయి BA తో సమానంగా చేశారు.డిగ్రీలో వుండే రెండవ భాషగా వుండే ఇంగిలీషు ఉండేది.అంతకు ముందు ఇంగిలీషు ప్రత్యేకంగా వ్రాసేవారు.అందుకు నేను BOL మూడేళ్లు చదివి ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎంట్రెన్స్ లో మొదటి స్థానంలో ఉండీ MA తెలుగులో చేరాను.అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి.అప్పుడు పరీక్షలు ఆలస్యం,ఫలితాలు ఆలస్యంగా వచ్చేని.ఫలితాలు రానందుకు మాకు ఎంట్రన్స్ రాసే అవకాశం లేదంటే అప్పుడు VC గా ఉన్న G. రామిరెడ్డి గారి దగ్గరకు వెళ్లి పొట్లాడి మా తప్పేమీ లేదు.ఉస్మానియా పరిధిలోనే ఉండేవి మా ఓరియెంటలో పరీక్షలు.అందుకని మీ విశ్వవిద్యాలయం తప్పే కాబట్టి మాకు అవకాశం ఇవ్వండి లేకుంటే సంవత్సరం నష్టపోవాల్సి వస్తుందంటే ధర్మాత్ముడు,మంచివాడు రామిరెడ్డి గారు సరే అని ఒప్పుకుంటే అర్హత పరీక్ష వ్రాసాము.మొదటి ర్యాన్కు వచ్చింది.అయితే BOL రిజల్ట్స్ వచ్చాకనే MA లో చేరాము.అదీ ఒక మరువలేని అనుభవం.
పరిషత్ లో చదివేప్పుడు ఆ 5 సంవత్సరాలు తెలుగు సాహిత్యంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నాము.పుస్తకాలు బయట ఎక్కువ దొరికెవి కావు.కొందామంటే పైసలు అంతంత మాత్రమే కాబట్టీ లైబ్రరీలో కూచుని నోట్స్ రాసుకుని, ఆచార్యులు చెప్తుంటే విని నోట్స్ రాసుకునే వాళ్ళము .శ్రీశ్రీ,దాశరథి,పుట్టపర్తి నారాయణాచార్యులు,జి.వి.సుబ్రహ్మణ్యం,దివాకర్ల వెంకటావధాని,సి.నారాయణ రెడ్డి, చేకూరి రామారావు,భద్రిరాజు కృష్ణమూర్తి,పుల్లెల శ్రీరామ చంద్రుడు,నాయని కృష్ణకుమారి,పి. యశోదారెడ్డి ఇంకా ఎంతో చాలా మంది మహానుభావుల ఉపన్యాసాలు వినే యోగం దక్కినందుకు వాళ్ళను చూసే అదృష్టం దక్కినందుకు రంగనాథాచారి గారికి మా అక్కకు ఎంతో ఋణపడి వున్నాను.అప్పటినుండి సాహిత్యం తో సహవాసం ఏర్పడి డిగ్రీ కళాశాల అధ్యాపకురాలిగా ఉద్యోగం చేశాను. పరిషత్ అంటే ఓ కుటుంబం.అందరం సరదాగా కలిసి ఉండేవాళ్ళం.ఎన్నో. పర్యాటక ప్రాంతాలకు వెళ్లి ఎన్నో ప్రాంతాలు చూశాము.జయదేవులు,కె.శ్రీనివాస్ నా తోటి విద్యార్థులు.పరిషత్ తో చాలా అనుబంధం.ఇప్పటికి ఆ ప్రాగణంలో అడుగుపెట్టినప్పుడు ఎంతో అనుభూతి, పుట్టింటికి వెళ్లినట్టి ఆనందం.

నా జీవితంలో మరుపురాని అనుభవం
——————————-
M A తెలుగు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాక M.Phil ను డా.ఇరివెంటి కృష్ణమూర్తి గారి పర్యవేక్షణలో చేస్తున్నాను.అప్పుడు APPSC లో JL పోస్టులు డిగ్రీ కాలేజ్ లెక్చరర్ పోస్టులు పడ్డాయి.మాకు P.hd లేదని డిగ్రీ పోస్టులకు హాల్ టికెట్ రాలేదు .పరీక్ష రాయడానికి అనుమతి కూడా ఇవ్వలేదు.JL కోసం రాశాము.వ్రాత పరీక్షలో పాసయ్యాము. గోల్డ్ మెడల్ సాధించిన వాళ్ళు కూడా పాస్ కాలేదు.మౌఖిక పరీక్షలో కూడా మంచి రిజల్ట్స్ తో ముందు వరుసలో ఉన్నాం. పోస్టులు తక్కువ పోటీ ఎక్కువ.సెలెక్ట్ అయ్యినట్టు ఆర్డర్స్ వచ్చాయి.చాలా సంతోషమేసింది. P.hdలో సీట్ వచ్చింది.నల్గొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ( బాలికలు) లో మొట్టమొదటి పోస్టింగ్.అప్పటివరకు నల్గొండ చూడలేదు.మా రఘు అన్నయ్య తోడుగా వచ్చాడు.
APPSC నుండి వచ్చిన ఆర్డర్ తీసుకుని జాయిన్ కావడానికి వెళ్ళాను.నవంబర్ నెల అయినా ఇంకా విద్యార్థులు ఇంటర్ లో చేరడానికి వస్తున్నారు.నమస్తే సర్ అని ప్రిన్సిపాల్ చెపితే కూచోండి అన్నారు.అక్కడ కుర్చీలో కూచున్నాం నేను అన్నయ్య.గంట అయింది రెండు గంటలయ్యింది.ఇంకా పిలడంలేదు అనుకుని నా పోస్టింగ్ ఆర్డర్ కాపీ ఇచ్చాను.ప్రిన్సిపాల్ ఆశ్ఛర్యానికి అంతులేదు.నేను ఇంటర్ సీట్ కోసం వచ్చానని వేయిట్ చేయమన్నాను సారి అని చెప్పి మీరు లెక్చరర్ గా చేరడానికి వచ్చారా అన్నాడు. అంటే నన్ను చూస్తే చిన్నపిల్ల అనుకున్నాడట. నేను ఉద్యోగ బాధ్యతలు చేపట్టాను.అది జీవితంలో జరిగిన సంఘటన తలచుకున్నప్పుడల్లా నవ్వొస్తది.
నల్గొండలో పనిచేసే రోజుల్లో
ఆకాలంలో విద్యార్థి ఎన్నికలు జరిగేవి.నేను అడ్వైజర్ కమిటిలో వున్నాను.ఎన్నికలయ్యాక గెలిచిన టీమ్ విజయోత్సవం చేసుకున్నారు.ప్రతి సంవత్సరం కాలేజ్ డే చేసేవాళ్ళం.కాలేజ్ డే సందర్బంగా అక్కడ ఉన్న MLA ను ZP చైర్మన్ కొంత మంది లీడర్లను,ఆ పట్టణ పెద్దలను ఇంటికి వెళ్లి మర్యాదగా పిలిచేవాళ్ళం. ఒకసారి ఇట్లనే MLA రుద్రమదేవి ఇంటికి వెళ్లి పిలిచాక ZP చైర్మన్ మల్లారెడ్డి ఇంటికి వెళ్లాం ఫంక్షన్ కు పిలవడానికి. కూచోమన్నాడు .తర్వాత ఇన్విటేషన్ కార్డ్ ఇస్తూ నాతో వచ్చిన యూనియన్ మెంబర్ లను పరిచయం చేస్తూ ఈ అమ్మాయి సెక్రెటరీ అన్నాను.వెంటనే ఆయన నువ్వు ప్రెసిడెంట్ వా అన్నాడు.కాదు మా మేడమ్ తెలుగు లెక్చరర్ అనేసరికి ఆశ్ఛర్యపోయి సారీ చెప్పాడు. ఇలా నా ఉద్యోగ జీవితంలో ఎన్నో మధుర ఘట్టాలు జరిగాయి.
ఇలాంటి ఘట్టాలు ఆసక్తి కరంకదూ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఇవ్వండి భరోసా !!

అమ్మాయి పెళ్లి