ఆడపిల్లకు వయసు పెరిగే కొద్ది భయాలు పెరుగుతూ ఉంటాయి తల్లిదండ్రులకు, అన్న మాట ఎంతో వాస్తవం.
పిల్లలంటే ప్రాణమే అయినప్పటికీ కొన్ని సమయాలలో కొన్ని విషయాలు చెప్పడానికి ఇబ్బంది పడుతుంటారు తల్లిదండ్రులు, మరీ ముఖ్యంగా ఆడపిల్లలకు. ఆడపిల్లకు 8 ఏళ్ల వయసు వచ్చేసరికి వారి శరీరాకృతిలో మార్పులు చోటు చేసుకోవడం ప్రారంభమవుతాయి. కొద్ది కొద్దిగా అవగాహన వుంటుంది కానీ పూర్తిగా అర్థం కాని విషయాలు ఎన్నో వారిని మధన పెడుతూ వుంటాయి.అప్పుడే తల్లి వారితో స్నేహంగా మెలగాలి. వారి సందేహాలను ఓర్పుతో తీరుస్తూ, ప్రేరణాత్మకంగా వారితో ముందుకు అడుగులు వేయించాలి. సాధారణంగా 8-14 ఏళ్ల మధ్య వయసున్న అమ్మాయిలలో రుతుస్రావం ప్రారంభమవుతుంది. దీనినే వివిధ ప్రాంతాలలో పుష్పవతి, రజస్వల అని వివిధ విధాలుగా పిలుస్తుంటారు.
మొదటిసారి రుతుస్రావం (నెలసరి) మొదలవడాన్ని మీనర్కే (Menarche) అని అంటారు.
అలాగే రుతుస్రావం ఆగిపోవడాన్ని మెనోపాజ్ (menopause) అంటారు. సాధారణంగా 40 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు గల మహిళలలో రుతుస్రావం (నెలసరి) ఆగి పోవడం జరుగుతుంది.
ఫుడ్ హ్యాబిట్స్ (food habits) వల్ల, lifestyle modifications వల్ల వివిధ రకాల కారణాల వల్ల ఈ Menarche అనేది చిన్న వయసులోని ఆడపిల్లల్లో ఆరంభం అవ్వడం పెద్ద సమస్యగా మారింది. ఆటలు, చదువు తప్ప వేరే ధ్యాస లేని పిల్లలు
అకస్మాత్తుగా జరిగే ఇలాంటి
విషయాలను చూసి ఆందోళనకు గురి అవ్వడం సహజం. అయితే ఇలాంటి సందర్భాలలోనే తల్లి వారికి ఆసరాగా నిలవాలి. ముందే వారికి ఇలాంటి విషయాల పట్ల అవగాహన కల్పించాలి, వారికి కలిగిన సందేహాలను తీరుస్తూ,
వారికి అర్థమయ్యే రీతిలో వివరించాలి. టాయిలెట్ కి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతాన్ని, చేతులను శుభ్రం చేసుకోవాలని లేకుంటే ఇన్ఫెక్షన్లు వచ్చి అనారోగ్యానికి గురి అవుతారని చెప్పి, పీరియడ్స్ (నెలసరి) అనేది ప్రతి మహిళ జీవన చర్యలో భాగమేనని చెప్పి వారిలో ధైర్యాన్ని పెంచాలి.
స్కూల్లో లేదా, మరే ప్రదేశంలోలైన ఉన్నప్పుడు టాయిలెట్ కి వెళ్లినప్పుడు మరకలు గానీ రక్తం అని కనిపిస్తే, కంగారు పడకుండా ముందు ఉపాధ్యాయులతో చెప్పి తల్లిదండ్రులకు సమాచారాన్ని ఇవ్వాలన్న సలహాలను ఇస్తూ, వారి స్కూల్ బ్యాగ్ లో ఒక ప్యాడ్ (pad) పేపర్లో చుట్టి ఉంచి దానిని వాడే విధానాన్ని కూడా తల్లి నేర్పించాలి. పుస్తకాల పాఠాలతో పాటు పరిశుభ్రత పాఠాలను విధిగా పిల్లలకు నేర్పించాలి. పీరియడ్స్ పట్ల అవగాహన లేని పిల్లలు హేళనకు గురి అయితే వారి చిన్న మనసులు గాయపడడంతో పాటు, వారు డిప్రెషన్ కి గురయ్యే అవకాశాలు ఎక్కువ. కాబట్టి ఇలాంటి విషయాల్లో తల్లే చొరవ తీసుకుని వారికి జ్ఞాన బోధ చెయ్యాలి.