రెండవ రోజు ప్రత్యేకత
శరన్నవరాత్రులు లేదా శారదా నవరాత్రులు అని చెప్పుకునే ఈ దుర్గా నవరాత్రులలో అమ్మవారిని వివిధ నామాలతో, వివిధ రూపాలతో తొమ్మిది రోజులు కొలుచుకోవడం జరుగుతుంది. అందున నేడు రెండవ రోజు. ఈరోజు అమ్మవారిని* బ్రహ్మచారిణి స్వరూపం*గా కొలుస్తారు. బ్రహ్మచారిణి అనగా వివాహం కాని వారు అనే అర్థం ఇక్కడ వర్తించదు. బ్రహ్మచారిణి అనగా…బ్రహ్మతత్వస్వరూపిణి అని అర్థం. బ్రహ్మ తత్వమును తెలుసుకునేటట్టు బ్రహ్మమును ఎరుకలోనికి వచ్చేటట్టు చేసేదే బ్రహ్మచారిణి స్వరూపము. బ్రహ్మము అనగా భగవంతుడు. అటువంటి భగవంతుని తెలుసుకోవటానికి అనుగ్రహం కలిగించేది బ్రహ్మచారిణి స్వరూపం. అట్టి అమ్మవారి అనుగ్రహం కలగాలి అంటే మనం ఏ పని చేస్తున్నా అమ్మవారు స్మరణలో ఉండాలి. ఆ విధంగా మానవుడు ప్రతి పనిలో అమ్మవారిని స్మరిస్తూ చేసే పూజనే నిరంతర పూజ, లేదా నిత్య పూజ అంటారు. మనిషికి భగవంతుడి పైన మనసు మరలటం ఎంత సహజమో…. అంతే సహజంగా ఆ మనసునుకోరికల వైపు ప్రాపంచిక విషయాల వైపు మళ్లించటం కూడా అంతే సహజం. అట్టి సహజ గుణాలు కలిగిన మనిషి లోపల ఉన్న పరమాత్మను తెలుసుకోవటానికి, ఇంద్రియములకు ప్రాపంచిక విషయములతో ఉన్న సంబంధము తెంచుకోవటానికి అమ్మవారి అనుగ్రహము తప్పకుండా కావాలి.ఆ అనుగ్రహాన్ని మానవమాత్రులైన మనకు ప్రసాదించి మానవునికి భగవంతుని తత్వాన్ని భగవంతుని తెలుసుకోవటానికి శక్తిని ప్రసాదించి అనుగ్రహించేది అమ్మవారు. ఆవిడకే బ్రహ్మచారిణి అని పేరు. ఎవరైతే అమ్మవారి పాదాలు పట్టుకుని వేడుకుంటారో వారిని తప్పకుండా అనుగ్రహిస్తుంది ఈ బ్రహ్మచారి స్వరూపిణి .
ప్రవచనకర్తల సౌజన్యంతో