దసరా ( దశ -హర )

ఈ దక్షిణాయనమంతా పండుగల సందడే. శ్రావణమాసంలో మంగళ గౌరీని’ వరలక్ష్మిని కొలిచాం. ఇల్లంతా పండగ వాతావరణం నింపాం. భాద్రపదంలో వరసిద్ధి వినాయక వ్రతాలు ఇంటా బయట ఎంతో ఆడంబరంగా జరుపుకున్నాం. పండగలన్నీ నిత్య జీవితంలో ఉన్న కష్టనష్టాలను కాసేపు ప్రక్కకు తోసి సంతోషాన్ని నిం పడానికే ఏర్పాటు చేయబడ్డాయి. అది కూడా కాల గణన, రుతుగణనల ఆధారంగా ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని ఏర్పరిచినవే . ఇందులో మనం తీసుకునే ఆహారంలో కూడా కాలానుగుణంగా సాత్వికతను, పుష్టిని కలిగించేవి ప్రవేశపెట్టారు. మనము వాడే పసుపు కుంకుమలు, కట్టే మామిడాకుల తోరణాలు అన్ని వాయు కాలుష్యాన్ని, అంటు రోగాలను నిర్మూలించవే.
. మానవజీవన విధానంలో గుణాలే ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకుంటాయి. అవి మంచివి కావచ్చు చెడివి కావచ్చు. వాటికి కొలమానాలు లేవు. కానీ ఈగుణాలను మన శాస్త్రాలు విభజన చేసి తమోగుణము, రజోగుణము, సత్వ గుణము అని పేర్కొన్నాయి.సామాన్యమానవులందరూ ఈ మూడు గుణాలకు లోబడే జీవితం సాగిస్తూ ఉంటారు. ఇది నిత్యము ప్రతి ఒక్క జీవితంలో సందర్భానుసారంగా ప్రస్ఫుటమయ్యేవే. సృష్టికి కూడా ఈ మూడు గుణాలే కారణభూతామని తత్వజ్ఞులు చెబుతారు. సాంద్రతలు మారవచ్చు గాని అందరిలోనూ కనిపించేవే. మంచి ప్రవర్తన కలిగితే సత్వ గుణ సంపన్నులు అంటారు.గర్వము,అహంకారము, దంభము ఇవి రజోగుణ లక్షణాలు. ఇకపోతే బద్ధకము అలసత్వం, అతి తిండి,అతి నిద్ర తమోగుణ లక్షణాలు. ఈ గుణాలను సరిదిద్దుకునే అవకాశం మానవులకు మాత్రమే ఉంది. జంతు జాలానికి లేదు.
తమో రజోగుణాలు చాలా గట్టివి. వాటిని వదిలించుకోవడం చాలా కష్టంతో కూడిన ప్రయాస. కానీ ప్రయత్నిస్తే వదిలించుకోవచ్చు. సత్వగుణమే అన్నిటా మెచ్చేది.
ఇప్పుడు మనము జరుపుకునే దసరాపండుగ కూడా గుణత్రయానికసంబంధించినదే.అరిషడ్వర్గాలు,మనసు,బుద్ధి, అహంకారములు అనే ఈ తొమ్మిది చెడు గుణాలను జయించడమే దీనిలోని పరమార్ధం. ప్రతి సంవత్సరం ఆశ్వీజ శుద్ధ పాడ్యము నుండి నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులనీ 10వ రోజు విజయదశమి కలిపి దసరా అంటారు. ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యం ఇచ్చే పండుగ. దీన్ని శరన్నవరాత్రి అని కూడా అంటారు. వర్షాకాలపు చిత్తడి తగ్గి ప్రకృతి ఆహ్లాదకరంగా ఉంటుంది.
నైతికంగా చెప్పుకోవాలంటే పైన చెప్పిన మూడు త్రిగుణాలను జయించడమే ఈ పండుగ యొక్కఅంతరార్థం. ఇవే కాక మనం ఆగామి కర్మలు, సంచిత కర్మలు, ప్రారబ్ద కర్మలుఅనే ఒకరకమైన సంపదలను మనం పుట్టుకతోనే తెచ్చుకుంటాం. ఈ సత్వ, రజ,తమోగుణాలు ఎలా నాశనం చేయబడతాయో ఒక పురాణ గాధ గా చెప్పబడింది.
సామాన్యులకు కథారూపంలోనే చెబితే అర్థమవుతుంది. అందుకే పూర్వం హరికథలు బుర్రకథలు, వీధి నాటకాల రూపంలో ప్రజానీకానికి అందించేవారు.ఇది మాత్రము దేవి సప్తశతి లేక దేవి మహాత్మ్యం అనే గ్రంథం లో రాసున్నది. నవరాత్రులలో మొదటి మూడు రోజులు మహాకాళి రూపాన్ని ఆరాధిస్తాం. ఈమె పది ముఖాలు పది పాదాలు కలిగి తన పదిహస్తములలో పది ఆయుధాలు ధరించి భీకరంగా ఉంటుంది. ఇది తామస గుణప్రదానమైనది.
మూడులోకాలను తపింప చేసే మధుకైటబులు అనే ఇద్దరు రాక్షసులను సంహరించడం కోసం అమ్మ యోగనిద్రలో ఉన్న, శుద్ధ స త్వగుణ పరిపూర్ణుడైన, విష్ణుమూర్తిని ఎన్నుకొని మధుకైటువులను,తనయోగమాయచే,సంహరింపజేసింది. లోకాలకు రాక్షస బాధ లేకుండా ఆగామి కర్మల ఫలితాలను నశింప చేసింది. లోకాలు రక్షించే నిమిత్తం తామసీమూర్తితో ఆవిర్భవించింది.
రెండో గుణం రజోగుణం. ఇందులో స్వార్థ బుద్ధి, విషయ భోగములలో లాలస, డాంబికం వంటివి ఉంటాయి. ఇవి కూడా కొంతవరకు ఆసురీ గుణాలే. రజోగుణ సంపన్నడు, త్రిలోకాలను జయించిన వాడు అయిన మహిషాసురుని సంహారం కోసం జగదంబ మహాలక్ష్మి రూపంలో 18 చేతులతో 18 ఆయుధాలు ధరించి ఆవిర్భవించవలసి వచ్చింది.ఇదే రాజస మహాలక్ష్మి మూర్తి. ఈమె భోగ మాయ. మహావీర, పరాక్రమాలతో ఉంటుంది. కానీ జయించవలసినది రజోగుణాన్ని. అందుకే ఆమెకు దేవతలందరూ వారి వారి శక్తిని ఇవ్వవలసి వచ్చింది. దానికి తోడు మహిషుడు పశుతుల్యుడు ( దున్నపోతు). వెంట 16 మంది సేన నాయకులను మీదు మిక్కిలి సేనను తెచ్చుకున్నాడు. వీరందరినీ ముందు సంహరిస్తేనే గాని మహిషున్ని సంహరించడం కుదరలేదుఅమ్మకు. చివరికి పదునెనిమిది చేతులతో పదునె ఎనిమిది ఆయుధాలు ధరించి, ఉన్మత్తి అయ్యి ( మధువు తాగి ) మహిషాసురుని సంహరించింది. సంచిత కర్మల ఫలితాలను నశింపజేసింది.
చివరి మూడు రోజులు అమ్మను మహా సరస్వతీ రూపంలో కొలుస్తారు.ఈమె జ్ఞానమయి.. 8 చేతులలో ఎనిమిది ఆయుధాలు ధరించి ఉన్నది. దీనికి కూడా ఒక పురాణ గాథ ఉంది. సత్వగుణ ప్రాధాన్యమైనది. ఇది సంపాదించాలంటే చాలా శ్రమ పడాలి. చాలా అవగుణాలను పోగొట్టుకోవాలి.
ఒకసారి జగదాంబ హిమగిరి పైన ఉన్న జాహ్నవి నది లో స్నానం చేయడానికి వచ్చింది. ఆమె అందాన్ని చూసిన శుంబుని మంత్రులు ఈవిషయంశుంభనిసుంబులకు తెలియజేశారు. వాళ్ళు ఆమె అందానికి మోహితులై వివాహ మాడాలని రాయబారం పంపారు. కానీ ఆమె పూర్వం ఒక శపథం చేశానని, నన్ను యుద్ధంలో ఎవరు జయిస్తారు వారిని వివాహం చేసుకుంటాను, కావాలంటే నాతో యుద్ధం చేసి గెలవమనిమీప్రభువుకుచెప్పు అని అంటుంది. శుమ్భనిశుమ్బులు కోపముతో మంత్రులను,సేనాపతులను బహువిధములైన సేనలతో ఆమెతో తలపడానికి పంపారు. అమ్మవారు తన వాహనమైన సింహం సహాయంతో అందరినీ చిత్తు చేసింది. రక్తబీజనుణ్ణి కూడా కాళీసహాయంతో నేలమట్టం చేసింది . అమ్మకు సహాయంగా అష్ట మాతృకలు వచ్చారు. ( బ్రహ్మీ, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, నరసింహి, ఇంద్రియ, చాముండా ). శంభుడు ఇంతమంది సహాయం తీసుకున్న నీవు ఏమి గొప్ప అని హేళన చేశాడు. అమ్మ వారందరినీ తన అంశలేనని తనలో కలుపుకొని ఒంటరిగా శుంభ నిశుమ్భ లను తన శూలం తో దనుమార్చింది. లోకోపకారం చేసి దేవతల పూజలు అందుకుంది. తమో,రజోగుణాలను నిర్మూలించి సత్వగుణం పొందడం కష్టంతో కూడుకున్న పని. అమ్మ కు ఈ రాక్షసుని చంపడానికి చాలా సమయమేపట్టింది. ప్రారబ్ద కర్మ ఫలితాలను నిరాకరించడమే శంభాసుర వద.
మానవులు కూడా మూడు గుణాలను జయించినప్పుడే శుద్ధ తత్వాన్ని పొందుతారు.. కానీ కష్టసాధ్యమైంది అది.గట్టిగా ప్రయత్నిస్తేనే ఫలితం దక్కుతుంది. ముందు తామస గుణలను తెలుసుకొని వాటిని అరికట్టుకోవడం కోసం ఎల్లవేళలా ఎరుకలో ఉండాలి. తర్వాత రాజస గుణాల మీద దండెత్తాలి.ఈ రెండు జయంంపబడితే మిగిలేది సత్వ గుణమే . దానికోసం ఏమి ప్రయాస పడక్కర్లేదు .కానీ పెద్దలు సత్వగుణం కూడా ఒక రకమైన అహంభావమే అంటారు. మోక్ష ప్రాప్తికి అడ్డంకు అంటారు. అక్కడ కూడా “నేను ” అనే అహం ఉంటుందట. అందుకే శుద్ధసత్వ ప్రాప్తే అంతిమ లక్ష్యం అంటారు. కానీ ఇప్పుడు మానవులు కలియుగంలో ఉన్నారు కనుక కనీసం తమ తామస,రాజగుణాలను సరి చేసుకోడాని అమ్మ పూజలో అహింస ప్రథమ పుష్పంగా,ఇంద్రియ నిగ్రహం ద్వితీయ పుష్పంగా, సర్వభూత దయ తృతీయ పుష్పంగా, క్షమా చతుర్ధ పుష్పంగా, శాంతి పంచమ పుష్పంగా, తపస్సు షష్టి పుష్పంగా, దానం సప్తమ పుష్పంగా, సత్యం అష్టమ పుష్పంగా, తృప్తి నవమపుష్పముగా తొమ్మిది రోజులు అమ్మకు సమర్పిస్తే పదో రోజుకి స్వచ్ఛమైన పరిశుద్ధమైన మనిషిగా మిగులుతాం. ఈ తొమ్మిది రోజులు ప్రతి ఒక్కరు మనలో ఉన్న దుష్ట ఆవరణలను తొలగించు కోవడానికి …నవావరణ పూజ చేస్తే అమ్మ అనుగ్రహం పొందడానికి అవకాశం దక్కించుకున్న వాళ్ళం అవుతాం. దీని ద్వారా మనమే కాదు కుటుంబం, సంఘం, దేశం, ప్రపంచం కూడా ఎలాంటి గుణ దోషాలు లేకుండా సుఖశాంతులతో వర్ధిల్లుతుంది.
ప్రతి అమ్మవారి గుడిలో రోజుకి ఒక అవతారం చొప్పున అమ్మవారి ను సిద్ధం చేస్తారు. కుంకుమ పూజలు, లలిత పారాయణులు, కుమారి పూజలు,బాల పూజలు విశేషంగా జరుగుతాయి.
రామాయణ గ్రంథ ప్రకారం విజయదశమి రోజున రాముడు రావణుని పై గెలిచిన రోజు అని తెలుస్తుంది. దీనిని పురస్కరించుకుని దేశం నలుమూలల రావణ దహన కార్యక్రమాన్ని వైభవంగ జరుపుతారు. భారతం ప్రకారం పాండవులు వనవాసానికి వెళుతూ జమ్మి చెట్టుపై ఉంచిన ఆయుధాలను తిరిగి తీసుకొనిన రోజుట ఈరోజు.ఆరోజు ఆయుధ పూజ, జమ్మి చెట్టు పూజ చేస్తారు. జమ్మీ ఆకులను ‘బంగారం‘ అని పెద్దలకు ఇచ్చి ఆశీర్వచనం పొందటం రివాజు.
తెలంగాణలో ‘ బతుకమ్మ‘ పండుగ వైభవంగా జరుపుకుంటారు. బతకమ్మలను తంగేడు, గునుగు, బంతి చేమంతి పూలతో నూ, వివిధ రకాలైన గడ్డి పువ్వులతో నూ అలంకరిస్తారు. ఆట పాటలతో బతుకమ్మ ను పూజించి నీటిలో నిమజ్జనం చేస్తారు.

ప్రకృతిలో ఈ శరత్ రుతువు పువ్వులు బాగా దొరికే సమయం. ఏదేమైనా భారతదేశంలో పండుగలు దైవత్వంతోనే ముడిపడి ఉంటాయి. ఈ సందర్భంగా అందరూ ఐకమత్యంతో ఒకరికి ఒకరు ఇచ్చుపుచ్చుకుంటూ సంతోషంగా గడుపుతారు. రోజు దిన చర్యలో ఉన్న సాధక బాధలు విడిచి పిన్నా,పెద్ద కొత్త బట్టలతో, పిండి వంటలతో బంధుమిత్రులతో కలిసి కులాసాగా జరుపుకుంటారు. ఈ రోజులలో ఆరోగ్యమే కాదు,ఆనందం కూడా మహాభాగ్యమైపోయింది. ఒంటికాయ సొంటి కొమ్ము వలె అయిపోయారు మనుషులు. అందరితో కలివిడిగా ఉండి మనకున్న సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకుంటే ఇవన్నీ మనకు దక్కుతాయి. ఇప్పుటి తరం నవ యువకులు వీటికి నడుం బిగించాలి. మన సంస్కృతి సాంప్రదాయాలను వెల్లి విరిసేలా చేయాలి.

మనదేశంలోనే కాదు విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా వారి వారి సంప్రదాయాలు ప్రకారం పండుగలు ఘనంగా జరుపుతూ మన ఆచార వ్యవహారాలను విదేశీయులకు చూపిస్తున్నారు. పండుగ ఏదైనా దానిలోని అంతర బోధనను “ఎరిగినవారి ద్వారా” తెలుసుకొని ఆచరిస్తే ఎరుక కలుగుతుంది. అది పిల్లలకు కూడా చెబుతూ మీరు ఆచరిస్తే భాగ్య సౌందర్యంతో పాటు అంతర శోధన కూడా జరుగుతుంది. నేటితరం అంతా విద్యావంతులు కనుక ఇది తెలుసుకోవడం కష్టం కాదు. ఆచరణే అభ్యాసం చేసుకోవాలి. దశ గుణాలను పోగొట్టుకోవడమే దసరా యొక్క ప్రధాన ఉద్దేశం. ఇలా పరిపూర్ణం పొందిన మనం వచ్చే కార్తీకంలో వెలిగించే దీపంలా ప్రకాశిస్తాం.
* జయ భవ **
* జై దిగ్విజయీభవ *

కామేశ్వరి వాడ్రేవు

Written by Kameshwari

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

అష్టాదశ శక్తిరూపిణులుగా- బొడ్డెమ్మ, బతుకమ్మ

దొరసాని