ఎడారి కొలను 

33 వ భాగం  

(ఇప్పటివరకు : కాంతమ్మ గారితో మైత్రేయి చేయూత స్వచ్ఛంద సేవ సంస్థ కి వెళుతుంది. తిరుగు ప్రయాణం లో కాంతమ్మ గారు మైత్రేయి కి తమ పెళ్లి ఎలా జరిగిందో చెబుతుంది. అంతే  కాకుండా మైత్రేయి  పెద్దక్క గురించి గురించి, చేయూత సంస్థ గురించి కొంత తెలుసు కుంటుంది. రాంబాయమ్మ గారి గురించి తనని ఇంటిదగ్గరే దిగబెట్టే నేపధ్యం లో అడిగి  తెలుసు కుంటుంది. ఇల్లు చేరుకోగానే వాళ్ళని రమాదేవి చూసిందని ఇద్దరు గమనిస్తారు.)

అలా కొద్దీ సేపు పడుకున్న మైత్రేయి కి సేద తీరినట్లయింది. “ అక్కమ్మ నువ్వు కూడా నాతో  నే తినేసేయ్. పద అన్నం వండుతాను. కూర పప్పు ఉన్నాయి. నువ్వు వడియాలు వేయించు. ప్రసాద్ గారిని కూడా పిలుచుకురా.,” అంటూ చక చక వంట గదిలోకి వెళ్లి పోయింది. అక్కమ్మకి కొత్త మనిషిని చూస్తున్నట్లుంది మైత్రేయిని చూస్తుంటే. 

బియ్యం కడిగి కుక్కర్ పెట్టింది. రాంబాయమ్మ గారిచ్చిన పప్పు, కూరని వేడి చేసింది. అల్మారా లో పెట్టిన వొడియాలా డబ్బా తీసి కొన్ని ఊరిన మిరపకాయలు , బియ్యపు వడియాలు వేయించింది. 

 “ అక్కమ్మ , కంచాలు పెట్టి ప్రసాద్ గారిని పిలుచుకురా,” అంటూ హడావిడి చేసింది. అప్పటికే ప్రసాద్ గారిని అక్కమ్మ పిలుచుకొచ్చిన విషయం గమనించకుండానే.  ప్రసాద్ కూడా కాస్త ఆశ్చర్యం గా నే ఆమెని గమనిస్తున్నాడు. భోజనం చేసేటప్పుడు కూడా మైత్రేయి మాట్లాడుతూనే ఉన్నది. ‘చేయూత సంస్థ’ గురించి, వసంత గురించి, ఆ భవంతి గురించి, రమణమ్మ గారు పెట్టిన రసం గురించి, జ్యోతి చేస్తున్న మారం గురించి, ఇలా ఎన్నో చెబుతూనే ఉన్నది. అక్కమ్మ ప్రసాద్ శ్రోతల్లా మిగిలిపోయారు, మైత్రేయి ని సంబరం గ చూస్తూ. భోజనాలవ గానే అక్కమ్మ గిన్నెలన్నీ సర్దేసింది,

కడగాల్సినవి సింక్ లో వేసొచ్చి “అమ్మ నువ్వు కాసేపు విశ్రాంతి తీసుకో, నేను నా పని చూసుకుంటా,” అంటూ వెళ్లి పోయింది. ప్రసాద్ కూడా లెవ బోతుంటే ,” ఇంకాసేపు కూర్చోండి ప్రసాద్ గారు, కబుర్లు చెప్పుకోవచ్చు,” అంది చాల చనువుగా. 

“ మనం సాయంత్రం కలుద్దామండి, మంచి భోజనం చేశాక, మీకు రావట్లేదేమో కానీ నాకు మాత్రం నిద్దర ముంచుకొస్తున్నది ,” అంటూ బయటి కొచ్చాడు. ‘ చాల మార్పు అయితే కనిపిస్తున్నది మైత్రేయి లో. ఇంత సంతోషం గ ఆమెని ఈ మధ్య కాలంలో అయితే చూడ లేదు. విషయం ఏంటో కాస్త  శాంతించాక అడగాలి ,’ అనుకొంటూ తన రూమ్ లోకి వెళ్లి పోయాడు.

మళ్ళి  మైత్రేయి ఒంటరిగా మిగిలి పోయింది ఆ మధ్యాహ్నం వేళా. కానీ ఈ రోజు ఆమెని ఒంటరి తనం భయ  పెట్టటం లేదు. ఎదో ఆత్మ విశ్వాసం. తనెలాగయినా సుబ్బారావు అనే సమస్య నుండి బయట పడాలి అన్న దృఢ సంకల్పం స్పష్టం గ ఆమె చూ పుల్లో  కనిపిస్తున్నది. తన బుక్స్ ఉన్న అల్మారా నుండి  ఒక నవల ను తీసుకొని పేజీలు తిప్పసాగింది. అది వడ్డెర చండి దాస్ గారు రాసిన మొదటి నవల,” హిమజ్వాల,” చాల పాత్రల వైవిధ్యం , సామాజిక ఘర్షణ , వ్యక్తి గత సంఘర్షణ లతో ఆ కధ నడుస్తుంది. అతి ప్రత్యేక మయిన శైలి “stream of consciousness” ని రచయిత చాల నైపుణ్యం తో ప్రయోగించారు. ఆ కధలో ఒక అన్వేషణ కనిపిస్తుంది. ఆ అన్వేషణలో పడే సంఘర్షణ కృష్ణ ,గీత పాత్రల గమనం లో స్పష్టమవుతుంది. అందుకే ఆ నవలను మళ్ళి  చదవాలని తెరిచింది. ఎన్ని సార్లు చదివిన ఎదో కొత్త కోణం కనిపిస్తున్నది. ఇప్పటి తన స్థితి లో తనకే కోణం లో ఈ కధ  స్ఫూర్తి నిస్తుందో చూడాలి అనుకుంటు “హిమజ్వాల” ను చదవడం మొదలెట్టింది. టైం చూసుకోలేదు.

” మైత్రేయి గారు , ఏంటి అంత దీర్ఘం గ చదువుతున్నారు,” అంటూ తలుపు తట్టి లోపలకొచ్చాడు ప్రసాద్. 

“అయ్యో అయిదయి పోయిందా! రండి , టీ పెడతాను,” అంటూ  కి చెన్ లోకి  వెళ్లి టీ పెట్టి , టీ తో పాటు కొన్ని కుక్కీస్ కూడా తీసుకొచ్చింది ఆమె. ఇంతలోకే అక్కమ్మ కూడా వచ్చేసింది. “నువ్వు కూడా టీ తాగు అక్కమ్మ ,” అని అన్నది.” వద్దమ్మా, ఇప్పుడే ఆ సుగుణమ్మ గారు ఇచ్చారు, తాగి వస్తున్నా,” అంటూ గిన్నెలు కడిగడానికి  లోపలికెళ్ళి పోయింది. 

“ మైత్రేయి గారు , బయటికి వెళ్లాలని ఉన్నది , మీరు కూడా వస్తారా, కొంత సామాను తెచ్చు కోవాలి, “ అన్నాడు.

“అవునండి. నాక్కుడా  కొన్ని సరుకులు కావాలి, పది నిముషాల్లో రెడీ అయి వచ్చేస్తాను ,వెళదాము , అంటూ బాత్రూం లోకి వెళ్ళింది.  ప్రసాద్ కూడా రూమ్ కెళ్ళి బాగ్ తీసుకొని, రూమ్ లాక్ చేసి వచ్చాడు. మైత్రేయి  వంగ పువ్వు రంగు జరీ బార్డర్ ఉన్న చీర ని కట్టుకొని తయారయింది. ఆమె నుండి చూపులు తిప్పుకోవడం కష్టమే అయింది ప్రసాద్ కి. అయినా నవ్వుతు,” ఎంత మార్పు మీలో ,” అంటూ అడిగేశాడు చిరునవ్వుతో.  “ బైకు మీద వెళదామా ,”  అన్నాడు. 

“ వద్దండి. నడిచి వెళదాము. రిటన్ లో ఆటో లో వచ్చేద్దాం సామాను  ఉంటుంది కదా !” అన్నది.

“ ఓకే మేడం ! మీరు ఎలా అంటే అల,” అంటూ బయటికి నడిచాడు. వెనకాలే మైత్రేయి. 

అలా వేళు తున్న వాళ్ళని చూస్తూ ,” వీళ్ళ భాగోతమేదో ఈ రాత్రికే తేల్చేయాలి,” అనుకుంటూ ధడాల్న కిటి కి తలుపులు కొట్టింది. అక్కమ్మ కు  శబ్దం వినిపించి చూసింది, “ రమా దేవమ్మ ఎదో కోపం మీదుందే , ఎవరి కొంపలు అంటించాలో!” అని తనలో తానే అనుకుంది.

మైత్రేయి , ప్రసాద్  దగ్గిరలోనే ఉన్న డిపార్ట్మెంటల్ స్టోర్ కి వెళ్లారు. అక్కడ కొన్ని సరుకులు తీసుకున్నారు. 

“ ప్రసాద్ గారు , ఐస్ క్రీం తినాలని ఉంది, ఏదైనా ఐస్ క్రీం పార్లర్ కి వెళదామా? “ అంది .

 “షూర్ ,షూర్ “  అంటూ  అక్కడనుండి బయట పడి  దగ్గిరలోనే ఉన్న ఐస్క్రీమ్పార్లర్  లోకి వెళ్లారు. 

“ నాకు బట్టర్ స్కాచ్ ఐస్ క్రిమ్,” అని చెప్పింది ఉత్సాహంగా.

 “ నేను  బ్లాక్ కరెంటు తీసుకుంటాను,” అంటూ కౌంటర్ దగ్గరి కెళ్ళి రెండు ఐస్ క్రీమ్స్ పట్టు కొచ్చాడు ప్రసాద్. 

ఆత్రం గా  ఐస్ క్రీం తింటున్న మైత్రేయి చాలా స్వచ్ఛంగా పసిపిల్ల లాగ  అనిపించింది అతనికి ఆమెని చూస్తుంటే. అలా  ఐస్ క్రీమ్స  తినడం అవగానే లేచారు వెళ్ళడానికి. 

ఎదురుగ కౌంటర్ దగ్గర నిలుచుని కనిపించాడు సుబ్బారావు. 

అప్పటి వరకు ఉన్న ఆనందం అంత మంచులా కరిగిపోయింది మైత్రేయి లో. ఎదో భయం, కంగారు కనపడుతున్నాయి. అదేం తెలియని ప్రసాద్, “రండి మైత్రేయి, వెళదాము, ,” అంటూ పిలిచాడు. “నువ్వేడివిరా నా భార్యను నీతో తిప్పుకోవడానికి,” అంటూ కాస్త వెకిలిగా నవ్వుతు మైత్రేయి ముందుకొచ్చాడు. 

“ ఏంటి మైత్రేయి , కొత్త ఫ్రెండా? పాత  ఫ్రెండా ? నాతో  ఎప్పుడు చెప్పలేదే? పరిచయం చేయవా?” అంటూ చనువుగా ఆమె చేయి పట్టు కున్నాడు. కంగారుగా అతని చెయ్యి విదిలించి కొట్టింది, “నేను నీ మొగుణ్ణే, నేను నీ చెయ్యి పట్టుకోవచ్చు, అలా దారిన పోయే వాడు కాదు,” అంటూ ఆమె చేతి ని మరింత బలం గ పట్టు కొని దగ్గరికి లాక్కున్నాడు. ఇదంతా చూస్తున్న ప్రసాద్ కి విషయం అర్ధమయింది, “ఇక్కడ గొడవ చేయకండి  సార్,  బయటికెళ్లి మాట్లాడుకుందాం,” అన్నాడు కొంత సౌమ్యంతో. 

“ బయటెక్కడ సార్? మేమెప్పుడో బయట పడి పోయాం. నన్నెప్పుడో ఈమె రోడ్డు మీద కి లాక్కొచ్చి పడేసింది, ఇంకా లోపల, బయట ఎంటి? అంత  బట్ట బయలే,”  అంటూ మాట్లాడ సాగాడు. 

ప్రసాద్ అతని దగ్గరి కొచ్చి , “ మైత్రేయి చేయిని విడిపించి,” మీరింకా గొడవ చేస్తే మీకే నష్టం. ఆడపిల్లను రోడ్డు మీద గొడవ చేశారన్న ఒకే ఒక్క నేరం కింద్ బొక్కలో తోస్తారు. అసలే మీ కేస్ కోర్ట్ లో ఉన్నది,ఇలా గొడవ చేయడం అవసరమా,” అంటూ సర్ది చెప్పా బోయాడు.

అంతే!  ఆవేశంగా సుబ్బరావు  చేయి ప్రసాద్ చెంపని చెళ్లు మనిపించింది.  మైత్రేయి కి కోపం ముంచు కొచ్చింది, ఆవేశంగ  ఎదో మాట్లాడ బోయింది. ఆమెను మాట్లాడొద్దని ఆపుతూనే, సుబ్బా రావు ని మైత్రేయి కి దూరం గ తోసేసాడు .

ఇక్క డేదో గొడవ జరుగు తుందనుకొని, కౌంటర్ లో కూర్చుని వున్నాయన, లేచొచ్చి,   “ఇక్కడ గొడవ చేయకండి సార్. మాకు కస్టమర్స్ వచ్చే సమయం.  బయటి కెళ్ళి పొండి , లేదంటే పోలీస్ లను పిలవాల్సి  వస్తుంది,”   అని  వార్నింగ్ ఇవ్వడంతో సుబ్బా రావు ఆవేశం గ బయటి కెళ్ళి పోయి,  “నీ అంతు  చూస్తాను ,” అంటూ తన బైకు స్టార్ట్ చేసి వేగంగా వెళ్లి పోయాడు. 

హతాసు రాలయి షాక్ లో ఉన్న  మైత్రేయిని  తీసుకొని  షాప్ లోంచి బయటికి వచ్చి ఆటో పిలిచాడు ప్రసాద్. అడ్రస్ చెప్పి పోనీయమన్నాడు. అతని వెనకాలే యాంత్రికం గ ఆటో లో కూర్చుంది. దారిలో అంతా  మౌనమే. సంతోషం తో వెలిగి పోయిన ఆమె మొఖం ఇప్పుడు కళావిహీనమయి  కోడి గట్టిన దీపం లాగా కనిపిస్తున్నది. ప్రసాద్ కి తనని కొట్టిన దాని కంటే  మైత్రేయి కి మళ్ళి  తగిలిన షాకు  నుండి ఆమె నెలా  కాపాడాలి అన్న ఆలోచనలో ఉన్నాడు. తన మూలంగ  ఏ  మాత్రం సంబంధం లేని ప్రసాద్ సుబ్బారావు చేతిలో చెంపదెబ్బ తినడం ఆమె జీర్ణించుకోలేక పోతున్నది. ఆటో వాళ్ళ ఇంటి వైపుకి మళ్లింది. రాత్రి  ఎనిమిది  అయింది.

 వస్తూనే లోపలికెళ్ళి పోయింది మైత్రేయి మౌనంగా. ప్రసాద్ కొంచం వెయిట్ చేసి చూసాడు,  కానీ ఆమె నుండి ఏమి బదులు రాలేదు.  తన రూమ్ లోకెళ్ళి , ఎం చేసుకోవాలో తోచక  మాగి చేసుకొని తినేసాడు. కానీ మనసంతా అదోలా ఉన్నది. మైత్రేయి ని ఓదార్చాలని ఉన్నది. కానీ ఆమె మౌనం కాస్త భయపెడుతున్నది. ఎం చేయాలా అని ఆలోచిస్తూ ఆమె రూమ్ వైపే మధ్య మధ్య లో చూస్తూ అటు ఇటు నడవడం చేస్తున్నాడు అతను తన రూమ్ లోనే. 

ఇంతలోకే పెద్దగా మైత్రేయి ఇంటి తలుపు కొడుతున్న శబ్దం వినిపించి చూసాడు. రమాదేవి దబా దబా మని తలుపు మీద కోడు తున్నది. ముందు నువ్వు బయటికి రా మాట్లాడాలి అని పెద్దగా అంటున్నది.  ఆమె వేనకాతలే పంతులు గారు నిలుచొని ఉన్నారు.

“ కాస్త నెమ్మదిగా  పిలువవే, అంత కొంప లేమి అంటుకు పోయాయని అరుస్తున్నావు. నిమ్మళంగా ,” అంటూ పంతులు ఆమెని సంభాళించాలని చూస్తున్నాడు. 

ఇదంత చూస్తున్న ప్రసాద్ ఒక్క ఉదుటన బయటి కొచ్చాడు. అతన్ని చూస్తూనే , “వచ్చావా నాయన , నిన్ను కూడా పిలుద్దామనే అనుకుంటున్నాను, ఆమెని కూడా రాని . మీ సంగతి ఇవాళ ఆటో ఇటో తేలి పోవాలి,” అంటూ యాగీ చేసే ధోరణిలో మాట్లాడడం మొదలు పెట్టింది. అప్పుడే తలుపు తెరిచి బయటి కొచ్చింది మైత్రేయి. 

“ ఏమైంది రమా దేవి గారు ! ఎందుకలా అరుస్తున్నారు ?” అంటూ అమాయకంగ అడిగింది. 

“అదే నమ్మా నీ విషయం. సంసారులం కదా ! మా భయాలు మాకుంటాయి . ఆ సంగతేంటో తెలుసుకుందామని పిలిచాను ,” అంటూ సాగ తీస్తూ మాట్లాడింది.

“లోపలకి రండి , లోపలకూర్చుని మాట్లాడుకుందాం ,”  అన్నది,

“ అంత  మర్యాద మాకెందుకు లేమ్మా, అంటూనే లోపలకు దారి తీసింది.”

“నువ్వు కూడా రావయ్యా ప్రసాద్ ,”అంటూ పంతులు గారు కూడా లోపలకు వెళ్ళాడు. 

ప్రసాద్ వాళ్ళని అనుసరించాడు. కాస్త గంభీరం గానే ఉన్నది పరిస్థితి అనిపించింది.

‘ఇప్పుడెలా తట్టుకోవాలి రమాదేవి ని,’ అనుకున్నాడు. మైత్రేయి తలుపు చేరవేసింది దగ్గరికి. 

“అంత రహస్యం ఏమున్నదమ్మ , అంతా  బట్ట బయలయితేను, కాకా పోతే జరిగిన భాగోతం  పూర్తిగా అర్ధం కాక చస్తున్నాము, అదేదో కాస్త చెప్పు తల్లి వింటాము. అప్పుడు మా గోడేదో మేము చెబుతాము, ” అంటూ మూతి మూడు వంకర్లు తిప్పింది.

(ఇంకా ఉన్నది)                                           

Written by Padma NeelamRaju

రచయిత గురించి:

పద్మావతి నీలంరాజు చండీఘర్ లో ఇంగ్లీష్ అధ్యాపకురాలిగా 35 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న రిటైర్డ్ ఉపాధ్యాయురాలు. ఆమె నాగార్జున విశ్వవిద్యాలయం ఆంధ్ర ప్రదేశ్ నుండి M A (Litt),
POST GRADUATE DIPLOMA IN TEACHING ENGLISH ,CIEFL, హైదరాబాద్‌ లో తన ఉన్నత విద్యను పూర్తి చేసింది. స్త్రీ వాద సాహిత్యంపై దృష్టి సారించి Indian writing in English లో Panjabi University, patiala , Panjab, నుండి M phil డిగ్రీ పొందింది. తెలుగు సాహిత్యం పైన మక్కువ ఇంగ్లీషు సాహిత్యంపై ఆసక్తితో ఆమె తన అనుభవాలను తన బ్లాగ్ లోను
( http://aladyatherdesk.blogspot.com/2016/02/deep-down.html?m=1,)
కొన్ని సాహితీ పత్రికల ద్వారా పంచుకుంటున్నారు. ఆమె రచనలు తరచుగా జీవితం మరియు సమాజం పట్ల ఆమెకున్న అనుభవపూర్వక దృక్పథాన్ని ప్రతిబింబిస్తాయి. ఆమె అధ్యాపకురాలిగా గ్రామీణ భారత్ పాఠశాలల్లో E-vidyalok- e-taragati (NGO) లో స్వచ్ఛంద సేవలందిస్తున్నారు. రచన వ్యాసంగం పైన మక్కువ. పుస్తకాలు చదవడం, విశ్లేషించడం (Analysis / Review) ఆంగ్లం నుండి తెలుగు లోకి అనువాదం(Translation) చేయడం అభిరుచులు . PARI సంస్థ (NGO) లో కూడా ఆమె గ్రామీణ భారత జీవన శైలిని ప్రతిబింబించే వ్యాసాలను కొన్నిటిని తెలుగులోకి అనువదించారు (padmavathi neelamraju PARI). HINDUSTAN TIMES, తరుణీ ,మయూఖ, నెచ్చెలి వంటి పత్రికలలో కొన్ని కధలు, వ్యాసాలు ప్రచురితమయ్యాయి. “Poetry is the sponteneous overflow of power feelings; recollected in tranquility” అన్న ఆంగ్ల కవి వర్డ్స్ వర్త్ తనకు ప్రేరణ అని చెబుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

దొరసాని

మన మహిళామణులు- డాక్టర్ సి. వసుంధర