ఎడారి కొలను 

( 51  వ భాగం ) 

(ఇప్పటివరకు:  అపూర్వ వస్తున్నట్లు మెసేజ్ పెడుతుంది. అపూర్వను రిసీవ్ చేసుకొని తెనాలి వస్తాడు ప్రసాద్. అపూర్వ మకాం మైత్రేయి తన ఇంట్లో ఏర్పాటు చేస్తుంది. మర్నాడు అపూర్వ తో సహా ప్రసాద్ లాయర్ వెంకటేస్వర్లు గారిని కలుస్తాడు)

   ప్రసాద్ ఇల్లు చేరేసరికి ఆలస్యమయింది. ఎందుకో అలసటగాను, మనసంతా భారంగాను ఉంది అతనికి. బైక్ పార్క్ చేసి వరండాలోకి రాగానే మైత్రేయి ఇంట్లోంచి పెద్దగా నవ్వులు ఇనపడుతున్నాయి. ‘ఇంకెవరొచ్చారబ్బా’ అని ప్రసాద్ మైత్రేయి ఇంటివైపు చూసాడు. లోపల మైత్రేయి  ఆమె కి ఎదురుగా అపూర్వ , పక్కనే ఇంకొకామె కూర్చుని ఉన్నట్టుగా కనిపించింది. లోపలకెళ్ళాడు. ఆశ్చర్యం భవ్య కూర్చొని ఉన్నది. వాళ్లిద్దరూ మైత్రేయి తోటి చాల స్నేహపూర్వకంగా మాట్లాడుతున్నారు. 

ప్రసాద్ ని చూస్తూనే ,  “హాయ్ ప్రసాద్ గారు! బాగున్నారా!” అంటూ పలకరించింది భవ్య.

“ బాగున్నానండి. మీరెలా ఉన్నారు. మీరెప్పుడొచ్చారు?” అడిగాడు ఆమెని. 

“అపూర్వ ఫోన్ చేసింది. నా కేమి విజయవాడలో పనిలేదు అందుకని కాబ్ తీసుకొని వచ్చేసాను. తెనాలికి చేరగానే , మైత్రేయి గారి చేత నాకు ఇంటి అడ్రస్ చెప్పించింది అపూర్వ. అందుకే మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండానే రాగలిగాను. ” 

“ అలాగే మీరు మాట్లాడుతూ ఉండండి , నేను ఫ్రెషప్ అయి వచ్చేస్తాను,”  అని ప్రసాద్ వెళ్ళిపోయాడు. 

వెళుతున్నప్రసాద్ కి, “ప్రసాద్ గారు , ఇక్కడే తిందురు గాని , ఇవాళ నేను అక్కమ్మ చేత అట్లు తెప్పించాను,” చెప్పింది. అలాగే అన్నట్టు తలూపి వెళ్ళిపోయాడు. రూమ్ లోకెళ్ళి తలుపేసుకున్నాడు. ఎందుకో కన్నీళ్లు ఆగడం లేదు. అప్పుడనిపించింది  ‘బాధ ఎవరికయినా బాధే’ ప్రసాద్ బెడ్ మీద వాలిపోయాడు.    కళ్ళు మాత్రం కన్నీళ్ళని ఆపలేక పోతున్నాయి. ఎందుకంటే ఆ బాధ గుండెలోతులలోంచి వస్తున్నది, కళ్లనుండి కాదు! అలా కొద్దిసేపయినా తరువాత లేచెళ్లి స్నానం చేసి తెల్లటి పైజామా లాల్చీ వేసుకొని , మాములుగా మైత్రేయి ఇంట్లోకి వెళ్ళాడు.

“హాయ్, లుకింగ్ స్మార్ట్ ,” అంటూ కాంప్లిమెంట్ ఇచ్చింది అపూర్వ.

ప్రసాద్ ఆ కాంప్లిమెంట్ కి కాస్త ఇబ్బందిగా ఫీలయ్యాడు. మైత్రేయి కనిపించింది, ‘అపూర్వ కి ప్రసాద్ అంటే చాలా ఇష్టమని. కానీ ప్రసాద్ ఎందుకు దూరం దూరం గా తిరుగుతున్నాడో నని. ’ తినేసింతరువాత మైత్రేయి అన్నది, “అపూర్వ మీరు నారూం లోఉన్న బెడ్ మీద పడుకోండి , ఈ దివాన్ మీద భవ్య పడుకుంటుంది. నేను సోఫా లో పడుకుంటాను,” అని.

“ అలా ఎందుకు మైత్రేయి రాత్రి లాగే నువ్వు నీ దివాన్ మీదనే పడుకో. నీ బెడ్ పెద్దదిగా,  మేమిద్దరం అడ్జస్ట్ అవుతాము, మేము ఫ్రెండ్స్ మెగా. మాకు అలవాటే లే ఇలా బెడ్ పంచుకోవటం,” అని చెప్పింది. అపూర్వ అన్న మాటల అంతరార్ధం  మైత్రేయికి తెలియక పోయినా, ప్రసాద్ కి అర్ధమయింది.  అయినా ఏమి పట్టించుకోనట్లు మొహం తిప్పేసుకున్నాడు. 

********************    

మరునాడు ఉదయాన్నే ప్రసాద్ కి వెంకటేశ్వర్లు గారు ఫోన్ చేసి ఉదయం పదిన్నరకల్లా తనని ఆఫీస్ లోకలవమని చెప్పాడు.  మైత్రేయి కాలేజ్ కెళ్ళేదాకా ఆగి ప్రసాద్ ఆ విషయం అపూర్వకి చెప్పాడు. భవ్య కూడా వస్తానన్నది. అలాగే అంటూ త్వరగా రెడీ అవమని చెప్పి , తాను కూడా రెడీ అయి వచ్చేసాడు. వాళ్ళు సిద్ధమయ్యారని తెలియగానే ఆటో తీసుకొచ్చి వాళ్ళి ద్దరిని ఆటో లో రమ్మని తాను తన బైక్ మీద బయలు దేరాడు.   చెప్పిన టైం కి పదిహేను నిముషాలు ముందుగానే లాయర్ వెంకటేశ్వర్లు గారింటికి చేరుకున్నారు. వాళ్ళని సుమంత్ వెంకటేశ్వర్లు గారి ఆఫీస్ గది  లో కూర్చోపెట్టాడు. వాళ్ళు వచ్చారని తెలియగానే వసుంధర పని పిల్ల చేత కాఫీ లు పంపింది పదినిముషాల్లో వస్తున్నానని చెప్పింది. 

“ హలో ప్రసాద్, నమస్తే అపూర్వ గారు ,”  అంటూ  భవ్యవైపు చూస్తూ ,” ఈమె?” అన్నాడు ప్రశ్నర్ధకంగా.

“ ఈమె అపూర్వ తో టి కలిసిఉంటున్న ఆమె ఫ్రెండ్ ,” అన్నాడు. 

షార్ట్ గా ఉంచుకున్న హెయిర్ స్టైల్ , జీన్స్ ప్యాంటు మీద లైట్ బీజ్ కలర్ టీ షర్ట్, బెల్ట్ షూ వేసుకోని మంచి సంపాదన  ఉన్న సాఫ్ట్ వెర్ ఎంప్లొయ్  లాగ కనిపించింది భవ్య వెంకటేస్వర్లు గారి కళ్ళకి. నిశితంగ గమనించాడాయన, ‘అపూర్వ ని చూస్తూ కూర్చున్న ఆమెలో అపూర్వ తనదే అన్న భావం,’ మెండుగా ఉన్నట్లనిపించింది. 

ఇంతలోకే వసుంధరకుడా వచ్చింది. పరిచయాలు అయ్యాక అసలు విషయం మొదలు పెట్టింది వసుంధర. 

“ అపూర్వ గారు మీకేం  కావాలనుకుంటున్నారు.”

“ప్రసాద్ నువ్వు చెప్పు,” అంది. 

“ చూడమ్మా , నిన్ను ప్రసాద్ వద్దనుకోలేదు. నువ్వే వద్దనుకున్నావు. అందుకని ముందుగా నువ్వే నీ అభిప్రాయం చెప్పాలి ,” అన్నాడు వెంకటేశ్వర్లు. 

అపూర్వ భవ్య వైపు చూస్తూ,  “భవ్య నువ్వు చెప్పు ,” అంది. 

“ అవునండి. మా మధ్య ఏర్పడిన బంధం సామాజికపరంగా అంగీకరించబడదు. పైగా మాలాటి  వారిని సపోర్ట్ చేసే చట్టం కూడా లేదు. మమల్ని ఎవ్వరు అర్ధం చేసుకోరు. అందుకనే అపూర్వ ప్రసాద్ గారి ని పెళ్లి చేసుకుంటే , మా విషయం లో ఎవ్వరికి అనుమానం రాదని అనుకున్నాము. పెళ్లయిన తరువాత మేమీ విషయం ప్రసాద్ గారికి చెప్పాము. అయన మంచి మనసుతో అపూర్వ ని అర్ధం చేసుకొని , ఇప్పటి వరకు మాకు అండగానే ఉన్నాడని చెప్పగలను. ఇప్పుడు నేను అపూర్వ ని U SA తీసుకెళ్ళిపోతాను. అక్కడ మేము హాయిగా ఉంటాము. అందుకు అపూర్వ శాస్వతం గా నాతో నే ఉండే పద్దతి ఏదయినా ఉంటె చెప్పండి,” అంది. 

బెరుకు లేకుండా భవ్య మాట్లాడిన తీరుని మెచ్చుకోలేక పోయింది వసుంధర. 

“ చాలా బాగా మాట్లాడారు భవ్య గారు. కానీ చిన్న సవరణ. మీరు సుఖంగా ఉండాలనుకుంటున్నారు. కానీ అపూర్వకి ప్రసాద్ గారి తో వివాహం అయ్యే  విధం గా మీరే ప్లాన్ చేసినట్లున్నారు. అవునా?” అంది. భవ్య మౌనంగా ఉండి  పోయింది.

“ మీ మౌనాన్ని  నేను అంగీకారం అనుకోవచ్చనుకుంటాను. మీరు ఎక్కడి కెళ్లిన భారతీయ చట్టప్రకారం అపూర్వ ప్రసాద్ గారి భార్య. మరి ఈ లీగల్ మ్యారేజ్ ని ఎం చేద్దామనుకుంటున్నారు,” అంది. 

“ ఇందులో ఏముందండి . వాళ్ళిద్దరి మధ్య కాంప్రమైజ్ జరిగితే చాలనుకుంటాను,” భవ్య అంది. 

 “మీరు కన్విన్స్ అయి ఒకరంటే ఒకరికి ఇష్టం మేము కలిసుంటాము అనుకోని కలిసున్నారు.  చూడండి అది కాంప్రమైజ్. కానీ ప్రసాద్ గారు, అపూర్వ గాని  వివాహం తరువాత విడివిడిగా ఉండడాన్ని చట్టం  గాని, సమాజం  గాని హర్షించదు. అలాకాకుండా విడి పోవాలనుకున్న దానికి కొన్ని పద్దతులున్నాయి. దానిపేరు విడాకులు. అప్పుడే చట్టబద్దం గా వాళ్ళు భార్య భర్తలు కారు. అప్పటివరకు మీరు గా ని, నేను గాని వారి వివాహ బంధాన్ని తెంచలేము. ఇంకో విషయం, మీ ఇద్దరి మధ్యన ఉన్న సంబంధాన్ని ప్రసాద్ గారికి పెళ్ళికి ముందే ఎందుకుచెప్పలేదు? అలా చెప్పి ఉంటె పెళ్లి జరిగేది కాదు. మీరిద్దరూ ఒక ఒప్పందం కింద కలిసుండేవాళ్లు దానినే లావెండర్ మ్యారేజ్ అని కూడా అంటారు. ఇంత తెలిసి , ఇంత ప్లాన్ చేసారు, మీకు ఒక్క సారి కూడా అనిపించలేదా ప్రసాద్ లాంటి ఒక మంచి వ్యక్తి జీవితం పాడయిందని? మీరు తప్పు చేసారని,” అంది. 

“తప్పు అంటే?” అడిగింది భవ్య . 

“ మీకు  అపూర్వకి ఉన్న బంధాన్ని దాచిపెట్టడం,” సూటిగా చెప్పింది వసుంధర.

“అతను మరొక వివాహం చేసుకోవాలన్న  ఈ సమాజం అంగీకరించదు? అతని మీదే నిందలేస్తుంది. అనుమానిస్తుంది.  అవమానిస్తుంది కూడా. ఇలాటి విషయాల్లో మగవారు కూడా చాలా సార్లు బాధించబడతారు. అది నేరమని మీకు అనిపించలేదా?” అని కొంచం కోపంగానే వసుంధర మాట్లాడింది. 

వసుంధర మాట్లాడిన వేగానికి అపూర్వకి భయం తో ఏడూపు  వచ్చేసింది. తలవంచుకొని కన్నీళ్లు తుడుచుకుంటూ కూర్చుంది. వెంకటేశ్వర్లు గారు వాతావరణం లోని వేడిని తగ్గించాలని , “నువ్వేమి భయపడకు అపూర్వ , ఏదొక మార్గం చూద్దాం లే. నేను ఇద్దరు ఎక్సపర్ట్స్ పిలిచాను వాళ్ళు వస్తుండాలి,” అన్నాడు. 

అప్పుడే  రాజ్య లక్ష్మి , “మేడం, ఫామిలీ కోర్ట్  లాయర్ రాఘవ రాణి,గారు వచ్చారు మేడం,” అని చెప్పింది.

 వెంటనే వసుంధర బయటికెళ్లి ఆమెని రిసీవ్ చేసుకొని లోపలకి తీసుకొచ్చింది. 

వసుంధర రాఘవ రాణి ని  వెంకటేశ్వర్లు గారి ఆఫీస్ రూమ్ లో కూర్చోపెట్టి లోపలికెళ్ళింది. కొద్దిసేపట్లోనే అందరికోసం కూల్ డ్రింక్స్ పోసిన గ్లాసులతో అక్కడి కి వచ్చింది. అందరికి కూల్ డ్రింక్ అందించి తాను ఎదురుగ ఉన్న తన ఆఫీస్ చైర్ లో కూర్చుంది. 

“ వసుంధర , ఎదో ఇంపార్టెంట్ విషయం నా  అడ్వైస్ కావాలని చెప్పావు, ఏంటా విషయం ,” అన్నది. 

“ అదా, “ అంటూ  అపూర్వ ప్రసాద్ లను చూపిస్తూ వాళ్లకున్న ప్రాబ్లమ్ వివరించింది. 

అలా మాట్లాడుతున్నప్పుడే, భవ్య కల్పించుకొని,  “మేడం , మీరు పదే  పదే  మాదే తప్పని మాట్లాడొద్దు, మేము కూడా ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలోనే ఇలా చేసాము, మమ్మల్ని అర్ధం చేసుకొని , మాకు ఒక లీగల్ అడ్వైస్ ఇవ్వండి చాలు. ఎంత ఫీజ్  అయినా  పరవాలేదు ,” అంటూ పొగరుగా మాట్లాడింది. 

“ భవ్య గారు, మీరు కాస్త పేషంట్ గా ఉండండి. వీళ్ళకి  మీ పట్ల సింపతీ ఉండడం వల్లనే , వాళ్ళ సమయాన్ని మనకోసం కేటాయించారు, ప్లీజ్!” అన్నాడు ప్రసాద్. 

భవ్య  మొహం  పక్కకు తిప్పేసుకొని కూర్చున్నది. 

“ అపూర్వ, మీరు విడాకులు తీసుకోవచ్చు.  ఎప్పుడంటే  మీకు మీ భర్త కి మధ్యన కనీసం రెండేళ్లపాటు దూరంగా ఉన్నారని సాక్ష్యం ఉంటె, ఇంకొక విషయం మీకు గా ని మీ భర్తకు గని చెప్పుకోలేని విధమయిన అనారోగ్యం ఉన్నద ని చెబితే , లేక పోతే ప్రసాద్ గారికి గా ని,  మీకు గాని రెండోవివాహం జరిగిందన్న ప్రూఫ్ ఉంటె, మరొక విషయం విడాకులు ఇద్దరికీ అంగీకారమే అయినప్పుడు మీకు విడాకులు  దొరుకుతాయి. వీటిల్లో మీ కు ఏ  రీజన్ ఉన్నద ని చెప్పాలి. అంతే కాదు మీకు భవ్య గారి మధ్యన ఉన్న సంబంధం లావెండర్ మ్యారేజ్ అనుకున్న, మీ విషయం కోర్ట్ వారికి స్పష్టం గ చెప్పాల్సి ఉంటుంది. ఆ విషయం లో మీ భర్తే మీకు వ్యతిరేకంగా అప్పీల్ చేస్తే మీకు విడాకులు త్వరగా  దొరకొచ్చు,” అంది లాయర్ రాఘవ రాణి. 

“ఎంతకాలం పడుతుంది?” 

 “కనీసం ఏడాది పట్టొచ్చు. ” 

“ అ మ్మో , అంత కాలం, మేము ఆరునెలల్లో అమెరికా వెళ్ళిపోవాలి.  త్వరగా అయ్యే ప్రోసిజర్ లేదా,” అంది అపూర్వ గాభరాగా. 

ప్రసాద్ కి తనని చుస్తే జాలేసింది.  “రాఘవ రాణి గారు! అపూర్వ పర్సనల్ ప్రాబ్లమ్ ని నేను పబ్లిక్ చేయదలుచుకోలేదు.  నేను నాభార్య విషయం లో ఎలాటి కాంప్రమైజ్ కయినా  సిద్ధమే. మేము మ్యూచువల్ అగ్రిమెంట్ తోటి విడిపోతాము. ఇందులో నేను ఆమె నుండేమి ఆశించటం లేదు. అలాగే ఆమె కు కాంపన్సేషన్ ఇచ్చేటంత స్థోమత నాకు లేదు. మెడ్రాస్ లో నేను కొనుకున్న ఫ్లాట్ తప్ప. అది కావాలంటే ఆమెకే వదిలేస్తాను. ఎలా ప్రొసీడ్ అవ్వాలో చెప్పండి.  అంతే కాదు మా మ్యారేజ్ అయినప్పటి నుండి ఆమెకి నాకు మధ్య ఎలాటి బంధము లేదు. పెళ్లిచేసుకున్న కొద్దీ నెలల కల్లా నేను ఆమెని వదిలేసి వచ్చి ఇక్కడ ఉంటున్నాను. కనీసం రెండు సంవత్సరాలు దాటిపోయాయి.” అంటూ వివరించాడు. అతని మాటల్లోని నిజాయితీ , అపూర్వ కున్న బలహీనత  చూస్తే అక్కడున్న అందరికి వాళ్ళ మీద సింపతీ కలిగింది. 

“అలాగే అయితే.  రేపు మీరు మా ఆఫీస్ కొచ్చి కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి కోర్ట్ ఫీజ్ మా అసిస్టెంట్ కిచ్చి వెళ్ళండి . మిగతా విషయాలు నేను చూసుకుంటాను. మీకు  త్వరలో విడాకులు వచ్చేలా ప్రయత్నం  చేస్తాను,” చెప్పింది లాయర్ రాఘవ రాణి. 

మరునాడు ప్రసాద్ అపూర్వని తీసుకొని లాయర్ రాఘవరాణి  ఆఫీస్ కి వెళ్ళాడు. భవ్య ఇంట్లోనే ఉండిపోయింది.  వీళ్ళు ఆఫీస్ చేరేసరికి లాయర్ రాఘవ రాణి  ఆఫీస్ లో ఉన్నది. అసిస్టెంట్ కి చెప్పి డాకుమెంట్స్ తయారు చేయించింది. 

“ ప్రసాద్ గారు, అపూర్వ, మీ కేసు లో నేను , మీకు బలవంతం గా వివాహం చేయబడిందని, మీకు గాని అతనికి గాని ఒకరి పట్ల ఒకరికి ఏ  వవిధమయిన ప్రేమ సంభంధం , ఆకర్షణ లేవని, అందుకే మీరు విడిపోయి స్వతంత్రం గా జీవించాలనుకుంటున్నారని, మీరు విడిపోయి రెండేళ్లకు పైగా దూరంగా ఉంటున్నారని డాక్యుమెంట్ తయారు చేశాను. వీలయినంత త్వరగా ఫ్యామిలీ కోర్ట్ లో రిజిస్టర్ చేస్తాను. వీలయితే మీ కేసు లోక్ అదాలత్ కి వచ్చేటట్లు కూడా ప్రయత్నం చేసి , మీకు చెప్పిందానికంటే ముందరే మీకు విడాకులు వచ్చేలా చేస్తాను. కానీ మధ్యలో ఒకటి రెండు సార్లు మీరు హాజరు కావాల్సి ఉంటుంది,” అని వివరించి వాళ్ల  చేత సంతకాలు చేయించి, ఆ రోజే  ఫైల్ చేయమనిఅసిస్టెంట్ ని కోర్ట్ కి పంపించింది.  

బయటికి వస్తూనే అపూర్వ ప్రసాద్ చేయి పట్టుకొని ఊపేస్తూ, “ ప్రసాద్ నీ ఋణం తీర్చుకోలేను,” అంది. “ నీకు నాకు ఏ  ఋణం లేదు. నువ్వు సంతోషం గా ఉండు,” అంటూ ఆమె తలమీద చేయి వేసాడు ప్రసాద్. 

పనయి పోయిందని చెప్పగానే భవ్య చెప్పింది, “రాత్రికే నేను మెడ్రాస్ కి ఫ్లయిట్ బుక్ చేశాను, ఈవెనింగ్ సిక్స్ కల్లా మనం విజయవాడ ఎయిర్పోర్ట్ కి వెళ్లి పోవాలి,” అన్నది. తలూపింది అపూర్వ. ప్రసాద్ వాళ్ళు వెళ్ళడానికి కాబ్ బుక్ చేసాడు. 

(ఇంకాఉంది) 

Written by Padma NeelamRaju

రచయిత గురించి:

పద్మావతి నీలంరాజు చండీఘర్ లో ఇంగ్లీష్ అధ్యాపకురాలిగా 35 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న రిటైర్డ్ ఉపాధ్యాయురాలు. ఆమె నాగార్జున విశ్వవిద్యాలయం ఆంధ్ర ప్రదేశ్ నుండి M A (Litt),
POST GRADUATE DIPLOMA IN TEACHING ENGLISH ,CIEFL, హైదరాబాద్‌ లో తన ఉన్నత విద్యను పూర్తి చేసింది. స్త్రీ వాద సాహిత్యంపై దృష్టి సారించి Indian writing in English లో Panjabi University, patiala , Panjab, నుండి M phil డిగ్రీ పొందింది. తెలుగు సాహిత్యం పైన మక్కువ ఇంగ్లీషు సాహిత్యంపై ఆసక్తితో ఆమె తన అనుభవాలను తన బ్లాగ్ లోను
( http://aladyatherdesk.blogspot.com/2016/02/deep-down.html?m=1,)
కొన్ని సాహితీ పత్రికల ద్వారా పంచుకుంటున్నారు. ఆమె రచనలు తరచుగా జీవితం మరియు సమాజం పట్ల ఆమెకున్న అనుభవపూర్వక దృక్పథాన్ని ప్రతిబింబిస్తాయి. ఆమె అధ్యాపకురాలిగా గ్రామీణ భారత్ పాఠశాలల్లో E-vidyalok- e-taragati (NGO) లో స్వచ్ఛంద సేవలందిస్తున్నారు. రచన వ్యాసంగం పైన మక్కువ. పుస్తకాలు చదవడం, విశ్లేషించడం (Analysis / Review) ఆంగ్లం నుండి తెలుగు లోకి అనువాదం(Translation) చేయడం అభిరుచులు . PARI సంస్థ (NGO) లో కూడా ఆమె గ్రామీణ భారత జీవన శైలిని ప్రతిబింబించే వ్యాసాలను కొన్నిటిని తెలుగులోకి అనువదించారు (padmavathi neelamraju PARI). HINDUSTAN TIMES, తరుణీ ,మయూఖ, నెచ్చెలి వంటి పత్రికలలో కొన్ని కధలు, వ్యాసాలు ప్రచురితమయ్యాయి. “Poetry is the sponteneous overflow of power feelings; recollected in tranquility” అన్న ఆంగ్ల కవి వర్డ్స్ వర్త్ తనకు ప్రేరణ అని చెబుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ధనుర్మాస వైభవం

మసి అంటని స్పటికం